ద్వారా: రాజేశ్వరి పరస
అక్టోబర్ 30 2023
ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/ఐ ఎన్ సొ తెలంగాణ/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి ఒక బహిరంగ సభలో చేసిన ప్రసంగం వీడియోని, క్లిప్ చేసి, ఎడిట్ చేసి, తన పార్టీని తానే విమర్శించారు అని క్లైమ్ చేశారు.
క్లైమ్ ఏమిటి?
తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ 30 నాడు, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 నాడు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో, ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒక వీడియోని షేర్ చేశారు (ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ ). అందులో బిఆర్ఎస్ కి చెందిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి వేదిక నుండి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సమక్షంలో పాలక పార్టీ మీద విమర్శలు గుప్పిస్తునట్టు ఉంది.
ఈ వీడియోలో తెలుగులో మాట్లాడుతున్న మల్లా రెడ్డి, “కేసిఆర్ పాలనలో దళితులు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. అయితే ఎవరికీ న్యాయం లభించటం లేదు. వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకుని బిఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ సభ్యులయ్యారు, మంత్రులయ్యారు. అయితే ప్రజలు మాత్రం ఏ మాత్రం అభివృద్ధి లేకుండా అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ అంటే స్కీములు, బిఆర్ఎస్ అంటే స్కాములు”, అని అంటున్నట్టు ఈ వీడియోలో ఉంది.
ఈ వీడియో షేర్ చేసి బిఆర్ఎస్ నాయకుడైన మల్లా రెడ్డి తన స్వంత పార్టీనే విమర్శిస్తున్నారు అని క్లైమ్ చేశారు. ఈ వీడియోని ఇతర సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్స్ లో కూడా షేర్ చేశారు (ఆర్కైవ్ వెర్షన్స్ ఇక్కడ మరియు ఇక్కడ).
ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/ఐ ఎన్ సి తెలంగాణ/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
వాస్తవం ఏమిటి?
ఈ 24 సెకన్ల వీడియోని జాగ్రత్తగా గమనిస్తే అందులో అనేక జంప్ కట్ లు మనకి కనిపిస్తాయి. వాటిని బట్టి ఇది ఎడిటెడ్ వీడియో అయ్యుండొచ్చు అని తెలుస్తున్నది.
దానితో ఒరిజినల్ వీడియో కోసం వెతికాము. ఈ బహిరంగ సభని అక్టోబర్ 18, 2023 నాడు స్థానిక వార్తా ఛానల్ టి న్యూస్ తమ యూట్యూబ్ ఛానల్ లో లైవ్ స్ట్రీమ్ చేసింది. “కేసిఆర్ బహిరంగ సమావేశం ప్రత్యక్ష ప్రసారం: ముఖ్యమంత్రి కేసిఆర్ మెదక్ లో ఎన్నికల ప్రచారం”, అని ఈ వీడియో శీర్షిక ఆంగ్లంలో ఉంది.
వైరల్ వీడియోని ఈ వీడియోలో 45 నిమిషాల దగ్గర నుండి చూడవచ్చు. ఒరిజినల్ వీడియోలో మల్లా రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని, తన పార్టీ బిఆర్ఎస్ ని కాదని మాకు అర్థమయ్యింది. ఈ వీడియో నుండి అక్కడ ఒక బిట్, ఇక్కడొక బిట్ తీసుకుని తను బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తునట్టు అర్థం వచ్చేలా వాటిని ఒక క్రమంలో చేర్చారని అర్థమయ్యింది.
45:36 టైమ్ స్టాంప్ “మనకి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. అయితే ఎవరికీ న్యాయం లభించటం లేదు. వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకుని..పార్లమెంట్ సభ్యులయ్యారు, మంత్రులయ్యారు. అయితే వాళ్ళు (పైన పేర్కొన్న వర్గాలు) మాత్రం ఏ మాత్రం అభివృద్ధి లేకుండా అక్కడే ఉన్నారు. అయితే కే. చంద్రశేఖర రావు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాకే వాళ్ళలో చాలా మంది అభివృద్ధి రుచి చూశారు”, అని మల్లా రెడ్డి మాట్లాడటం మనం వినవచ్చు.
47:37 టైమ్ స్టాంప్ దగ్గర “కాంగ్రెస్ అంటే స్కాములు, బిఆర్ఎస్ అంటే స్కీములు”, అని అనటం మనం వినవచ్చు. ఈ భాగాన్ని తీసుకుని కాంగ్రెస్ అనే దగ్గర బిఆర్ఎస్, బిఆర్ఎస్ అనే దగ్గర కాంగ్రెస్ అని వచ్చేటట్టు ఎడిట్ చేశారు.
తెలుగు డైలీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మల్లా రెడ్డి ప్రసంగాన్ని అక్టోబర్ 18, 2023 నాడు తమ యూట్యూబ్ లో ఛానల్ లో అప్లోడ్ చేసింది. “మేడ్చల్ బిఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి మల్లా రెడ్డి దూకుడైన ప్రసంగం”, అని ఈ వీడియోకి ఆంగ్లంలో శీర్షిక పెట్టారు. ఈ వీడియోలో 6:00 టైమ్ స్టాంప్ దగ్గర మల్లా రెడ్డి ఇదే ప్రసంగాన్ని మనం వినవచ్చు.
తీర్పు
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి ప్రసంగంలో భాగాలని క్లిప్ చేసి, ఎడిట్ చేసి తను తన పార్టీ అయిన బిఆర్ఎస్ ని విమర్శించారు అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారించాము.
(అనువాదం- గుత్తా రోహిత్)
ఈ వాస్తవ తనిఖీని చదవండి
ఈ వాస్తవ తనిఖీని చదవండి