విద్య అందుబాటు విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో లేదు

ద్వారా: రోహిత్ గుత్తా
జనవరి 10 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
విద్య అందుబాటు విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో లేదు

విద్య అందుబాటు విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానాన ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ, వార్తా కథనాలు చేసిన క్లైమ్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఏఎన్ఐ/రిపబ్లిక్ వల్డ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికల ప్రకారం విద్య అందుబాటు విభాగంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం మేఘాలయ.

క్లైమ్ ఐడి 5aa367fc

క్లైమ్ ఏంటి?

జనవరి 6 నాడు ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. విద్య అందుబాటు విభాగంలో కేరళ రాష్ట్రాన్ని తలదాన్ని ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అందులో రాశారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి వారి ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ నివేదికలు దీనికి ఆధారం అని తను ఆ పోస్ట్ లో తెలిపారు. 36.55 స్కోర్ తో ఉన్న కేరళని 38.55 స్కోర్ తో ఆంధ్ర దాటి దేశంలోనే అగ్రభాగాన నిలిచింది అని తను రాశారు. అందుకు కాను వై ఎస్ జగన్ మోహన్  రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

తను పోస్ట్ చేశాక, ఈ క్లైమ్ ని సామాజిక మాధ్యమాలలో ఇతరులు షేర్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ). ఏఎన్ఐ, రిపబ్లిక్ వల్డ్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, మిర్రర్ నౌ లాంటి మీడియా సంస్థలు కూడా ఈ క్లైమ్ ఆధారంగా దీని గురించి వార్తా కథనాలు ప్రచురించాయి.

మంత్రి క్లైమ్ ని షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే మంత్రి క్లైమ్ తప్పు.

మేము ఏమి తెలుసుకున్నాము?

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి మొదటి నివేదికని 2021 లో, రెండవ మరియు తాజా నివేదికని 2023 లో విడుదల చేసింది.  ఈ రెండు నివేదికలలోనూ దేశంలో అగ్రస్థానాన ఉన్న రాష్ట్రం మేఘాలయ.

అంతే కాక, 2021లో విద్య అందుబాటి విభాగంలో కేరళ కన్నా పై స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ 2023 నాటికి కేరళ కిందకి దిగజారింది.

మేము 2021 నాటి నివేదిక చూశాము. 2018-2020 మధ్య నైపుణ్యాల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ని ఇందులో ‘చిన్న రాష్ట్రాల’ విభాగంలో పెట్టారు. విద్య అందుబాటు విభాగంలో ఆంధ్ర స్కోర్ 38.50కాగా, మరొక ‘చిన్న రాష్ట్ర’ అయిన కేరళ స్కోర్ 36.55. 2021లో కేరళ కన్నా పైస్థానంలో అయితే ఉంది కానీ, దేశంలో అగ్రస్థానాన లేదు. ‘చిన్న రాష్ట్రాల’ నివేదికలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఆ రాష్ట్రం స్కోర్ 39.94. ఈ నివేదికలో 104 వ పుటలో పేర్కొనట్టు దేశవ్యాప్తంగా అగ్రస్థానాన ఉన్న రాష్ట్రం మేఘాలయ. 63.44 ఈ రాష్ట్రం స్కోర్. 

2021లో ఆంధ్ర, కేరళ, మేఘాలయ విద్య అందుబాటు స్కోర్లు (సౌజన్యం: ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ నివేదిక/స్క్రీన్ షాట్స్)

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపిటీటివ్నెస్ (హార్వార్డ్ బిజినెస్ స్కూల్ వారి ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజీ అండ్ కంపిటీటివ్నెస్ వారి భారతదేశ శాఖ) వారు ఉమ్మడిగా తయారు చేసిన ఈ నివేదికలలో విద్యాలయాలలో వసతులు, విద్య అందుబాటు, ప్రాధమిక ఆరోగ్యం, నేర్చుకునే నైపుణ్యాలు, విద్యా పరిపాలన లాంటి అంశాల స్కోర్ల ఆధారంగా దేశంలోని రాష్ట్రాలని, కేంద్ర పాలిత ప్రాంతాలని ర్యాంకుల వారీగా విభజించారు. దీనికి సంబంధించిన డేటాని ఎన్ ఎస్ ఎస్ ఓ నివేదికలు, ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ నివేదికలు లాంటి అధికారిక నివేదికల నుండి సేకరించారు.

2023 నివేదికలో ఆంధ్ర స్కోర్ 38.25 కాగా కేరళ స్కోర్ 48.85. 155 పుటలో పేర్కొన్నట్టు మేఘాలయ మళ్ళీ 77.17 స్కోర్ తో అగ్రస్థానాన నిలబడింది. 

2023లో ఆంధ్ర, కేరళ, మేఘాలయ విద్య అందుబాటు స్కోర్లు (సౌజన్యం: ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ నివేదిక/స్క్రీన్ షాట్స్)

రెండు నివేదికలలోనూ మేఘాలయ అగ్రస్థానంలో ఉంది. అలాగే 2021లో కేరళ కన్నా ఎక్కువ స్కోర్ సాధించిన ఆంధ్ర, 2023 నాటికి వెనకబడింది.

ఈ విషయం గురించి మాట్లాడటానికి లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ వారిని సంప్రదించింది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక నుండి తీసుకున్న డేటానే అని, అయితే మంత్రి పోస్ట్ లో సమాచారం తప్పని, విద్యా శాఖ మంత్రి హ్యాండిల్ ఎక్కడ నుండి ఈ సమాచారం తీసుకున్నారు అనేది తమకి తెలియదని విద్యా శాఖకి చెందిన పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి మాకు తెలిపారు.

తీర్పు

2021లో ‘చిన్న రాష్ట్రాల’ విభాగంలో ఆంధ్ర కేరళ కన్నా ముందంజలో ఉన్న మాట వాస్తవమే కానీ దేశంలో అగ్ర స్థానంలో లేదు. అలాగే 2023 నాటికి కేరళ కన్నా దిగజారింది కూడా. రెండు నివేదికల ప్రకారం మేఘాలయ అగ్రస్థానాన ఉన్నది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

(అనువాదం- గుత్తా రోహిత్)





ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.