కర్ణాటకకి చెందిన పాత వీడియోని షేర్ చేసి తెలంగాణలో బస్సులో గొడవపడుతున్న మహిళలు అని క్లైమ్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
డిసెంబర్ 13 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కర్ణాటకకి చెందిన పాత వీడియోని షేర్ చేసి తెలంగాణలో బస్సులో గొడవపడుతున్న మహిళలు అని క్లైమ్ చేశారు

సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది కర్ణాటకకి చెందిన జూలై నాటి వీడియో. తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పధకాన్ని అపహాస్యం చేస్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నారు.

క్లైమ్ ఐడి 713dd7a3

క్లైమ్ ఏంటి?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధికారంలోకి రాగానే మహిళలకి లగ్జరీ కేటగిరీ తప్ప మిగతా బస్సులలో ప్రయాణాన్ని ఉచితం చేసింది . ఈ పధకం పేరు మహాలక్ష్మి. డిసెంబర్ 9 నాడు ఈ పధకాన్ని అమలులోకి తీసుకొచ్చారు.

ఈ పధకం ప్రారంభించాక తెలంగాణలో ఒక తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి చెందిన బస్సులో గొడవపడుతున్న మహిళలు అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. దీనికి శీర్షికగా, “రేవంత్ రెడ్డి ఫస్ట్ స్కీం సక్సెస్ ఉచిత బస్సులో తెలంగాణ మహిళలు గొడవ పెట్టుకోవడం,” అని పెట్టారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది కర్ణాటకకి చెందిన వీడియో.

మేము ఏం తెలుసుకున్నాము?

మొదటగా, ఈ వీడియోలో మనకి వినిపిస్తున్న భాష కన్నడ. ఇది కర్ణాటక అధికారిక భాష. రెండవది, ఇందులో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఈ వీడియో జూలై నుండి ఆన్లైన్ లో ఉందని తెలిసింది. అప్పుడే కర్ణాటక ఎన్నికలు జరిగి, అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

న్యూస్ ఫస్ట్ కన్నడ ఈ వీడియోని తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో జులై 1 నాడు షేర్ చేసి, “ఉచిత బస్సులో సీట్ కోసం మరొక గొడవ. కే ఎస్ ఆర్ టి సి బస్సులో సీట్ కోసం మహిళల గొడవ,” అని కన్నడ లో శీర్షిక పెట్టారు.

కర్ణాటక స్థానిక మీడియా కూడా ఈ వీడియో గురించి వార్తా కథనాలు ప్రచురించింది. కళ్యాణ వాయిస్ అనే కన్నడ వెబ్సైట్ జులై 2 నాడు ఈ వీడియోని షేర్ చేసి, “రాయచూర్ లో బస్సులో సీట్ కోసం గొడవపడుతున్న మహిళలు. ఈ వీడియో వైరల్ అయ్యింది,” అనే శీర్షిక పెట్టింది. పైన పేర్కొన్న వైరల్ క్లిప్ యొక్క మరింత స్పష్టమైన వెర్షన్ ఇది. రాయచూర్ నుండి సిరావర్ వెళ్తున్న బస్సులో జరిగిన గొడవ అని ఈ కథనంలో పేర్కొన్నారు.

స్థానిక పాత్రికేయులు నీలకంఠ లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ ఇది రాయచూరులో జరిగింది అని, కర్ణాటకలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిపించిన శక్తి పధకాన్ని ప్రారంభించాక జరిగిన ఘటన ఇదని తెలిపారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ కె ఎస్ ఆర్ టి సి కి చెందిన ఒక బస్ డిపోట్ మేనేజర్ తో కూడా మాట్లాడింది. పేరు తెలపడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు. ఇది కర్ణాటకకి చెందిన వీడియోనేనని తను మాకు తెలిపారు. “ఇది కర్ణాటకకి చెందిన పాత వీడియో. ఇటువంటి ఘటనలు కొన్ని మా రాష్ట్రంలో జరిగాయి. ఉచిత బస్సు ప్రయాణం పధకం ప్రవేశపెట్టాక మహిళలు గొడవపడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. పధకం మొదటి రోజులలో ఇటువంటి ఘటనలు సాధారణమే. నెమ్మదిగా బస్సులు సంఖ్య పెంచాక ఇటువంటి ఘటనలు తగ్గిపోయాయి,” అని ఆ వ్యక్తి మాకు తెలిపారు.

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జూన్ మధ్యలో శక్తి పధకానని ప్రవేశపెట్టింది. ఇది వారి ఆరు గ్యారంటీలలో ఒకటి. ఇటువంటి ‘మహాలక్ష్మి’ పధకాన్నే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టింది. ఈ పధకంలో భాగంగా తెలంగాణ మహిళలు తెలంగాణలో ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.

తీర్పు

కర్ణాటకకి చెందిన కె ఎస్ ఆర్ టి సి బస్సులో మహిళలు గొడవపడుతున్న పాత వీడియోని తెలంగాణకి చెందిన తాజా వీడియో అని క్లైమ్ చేశారు. కాబట్టి, ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.