‘ముస్లిం డిక్లరేషన్’ నిధుల కోసం ఆలయ భూములు వేలం వేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించలేదు

ద్వారా: రోహిత్ గుత్తా
నవంబర్ 17 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
‘ముస్లిం డిక్లరేషన్’ నిధుల కోసం ఆలయ భూములు వేలం వేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించలేదు

సామాజిక మాధ్యమాలలో వచ్చిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

రేవంత్ రెడ్డి మాటలుగా చలామణీ అవుతున్న ఈ స్క్రీన్ షాట్స్ ఫేక్. తాము ఈ వార్త ప్రచురించలేదు అని Way2News వార్తా సంస్థ పేర్కొంది.

క్లైమ్ ఐడి 9d4b3fbd

క్లైమ్ ఏమిటి?

నవంబర్ 30 నాడు జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపధ్యం లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏ. రేవంత్ రెడ్డి పేరు మీద ఒక రెండు స్క్రీన్ షాట్స్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. తాము అధికారంలోకి వస్తే కనుక మైనారిటీ వర్గాల డిమాండ్లు తీర్చడానికి ఆలయ భూములు వేలం వేస్తామని తను అన్నట్టు ఈ స్క్రీన్ షాట్స్ లో ఉంది. 

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒక యూజర్ ఈ స్క్రీన్ షాట్స్ షేర్ చేసి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకి జవాబుగా రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారని రాసుకొచ్చారు. అందులో ఒక స్క్రీన్ షాట్ ఎన్ టీవీ వారి టెంప్లేట్ కాగా, మరొకటి Way2News వారిది (ఆర్కైవ్ ఇక్కడ). 

Way2News వారి టెంప్లేట్ లాగా ఉన్న టెంప్లేట్ మీద ఇలా ఉంది- ముస్లిం డిక్లరేషన్ నిధుల కోసం అవసరమైతే ఆలయ భూములు వేలం వేసి ముస్లింలని ఆదుకుంటామనీ టి-పీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లిం డిక్లరేషన్ కు నిధులు ఎలా సమీకరిస్తారని ఒక న్యూస్ చానల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి పై విధంగా జవాబిచ్చారు. 

ఎన్ టీవీ వారి టెంప్లేట్ లాగా ఉన్న టెంప్లేట్ మీద ఇలా రాసి ఉంది- ముస్లిం డిక్లరేషన్ కోసం అవసరమైతే గుళ్లకు సంబంధించిన భూములు వేలం వేసి ముస్లింలను ఆదుకుంటాం. ముస్లింలను అన్ని రకాలుగా ఆదుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే: రేవంత్ రెడ్డి. 

ఈ స్క్రీన్ షాట్లని  ఫేస్బుక్, వాట్స్ఆప్ లాంటి ఇతర మాధ్యమాలలో కూడా షేర్ చేస్తున్నారు. ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు). 

సామాజిక మాధ్యమాలలో వచ్చిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: వాట్స్ఆప్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ స్క్రీన్ షాట్స్ ఫేక్. Way2News కానీ, ఎన్ టీవీ కానీ ఇటువంటి వార్తను ప్రచురించలేదు.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ స్క్రీన్ షాట్స్ లో ‘ముస్లిం డిక్లరేషన్’ అని రాశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినది ‘మైనారిటీ డిక్లరేషన్’. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా తెలంగాణలోని మైనారిటీ వర్గాలకి కొన్ని పధకాలని వాగ్ధానం చేసింది. సిక్కులు, బౌద్ధులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు తెలంగాణలో మైనారిటీ వర్గాలు.

ఈ డిక్లరేషన్లో ఇది కేవలం ముస్లింలకి అనో లేదా ఈ డిక్లరేషన్ కోసం ఆలయ భూములు వేలం వేస్తామనో కానీ లేదు. అలాగే రేవంత్ రెడ్డి ఆలయ భూముల వేలం గురించి ఏమన్నా మాట్లాడారా అని వార్తల కోసం చూస్తే ఏమీ లేవు.

Way2News స్క్రీన్ షాట్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే నవంబర్ 14, 2023 నాడు వాళ్ళు తమ ఎక్స్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ ఒకటి కనిపించింది. తాము ఈ వార్తను ప్రచురించలేదు అని వారు ఆ పోస్ట్ లో స్పష్టం చేశారు. Way2News స్క్రీన్ షాట్ షేర్ చేసి “ఇది Way2News కథనం కాదు. కొంతమంది దుండగులు మా లోగో వాడి తప్పుడు సమాచారం షేర్ చేస్తున్నారు. మేము అటాచ్ చేసిన పోస్ట్ వైరల్ కూడా అయ్యింది. ఇది మేము ప్రచురించింది కాదని మేము స్పష్టం చేస్తున్నాము”, అని రాశారు.

Way2News వారి ప్రకటన స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

Way2News గతంలో పలు సార్లు తమ టెంప్లేట్ వాడి సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన తప్పుడు సమాచారాం మీద ఇలాగే స్పష్టతని ఇచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ ఫేక్ అని నవంబర్ 14, 2023 నాడు తమ ఎక్స్ లో స్పష్టంగా పేర్కొంది. 

తెలంగాణ కాంగ్రెస్ ప్రకటన స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

తీర్పు

కాంగ్రెస్ పార్టీ తాము ప్రకటించిన ‘మైనారిటీ డిక్లరేషన్’ కోసం ఆలయ భూములు వేలం వేస్తామని పేర్కొన్నట్టు ఫేక్ స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.