ద్వారా: రాజేశ్వరి పరస
ఏప్రిల్ 12 2024
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
ఎన్నికలలో ఓటు వేయాలంటే తప్పనిసరిగా భారతీయులు ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలి.
క్లెయిమ్ ఏమిటి ?
ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 మధ్య లోక్ సభ ఎన్నికల జరగనున్న నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ 1:32 సెకెన్ల నిడివి గల వీడియోలో భారతీయ ఓటర్ల హక్కుల గురించి పలు క్లైమ్స్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన పోస్ట్ ను ఇక్కడ చూడవచ్చు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
వైరల్ వీడియోలో వ్యక్తి నాలుగు విషయాలు చెప్తుంది:
ఓటర్ జాబితాలో తమ పేరు లేకపోతే, సెక్షన్ 49A ద్వారా ఆధార్ కార్డును పోలింగ్ స్టేషన్ లో చూపి ‘ఛాలెంజ్డ్ ఓటు’ ను అడగవచ్చు.
ఒక వేళ మీ వోట్ ఇంకొకరు వేస్తే, టెండర్ ఓట్ వినియోగించవచ్చు
పోలింగ్ బూత్ లో 14 శాతం కన్నా అధికంగా టెండర్ ఓట్లు నమోదు అవుతే, మరలా అక్కడ పోలింగ్ నిర్వహించవచ్చు.
మీ దగ్గర ఓటర్ కార్డు లేకపోయినా, ఓటరు జాబితా లో పేరు లేకపోయినా, మీ రెండు ఫోటోలు, ఏదైనా ఫోటో ఉన్న గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ బూత్ కు వెళ్లి అక్కడ ఫారం 8 ని పూర్తి చేస్తే సరిపోతుంది
అయితే, వీటన్నింటిలో ఒక్క రెండో పాయింట్ మాత్రమే నిజం కాగా, మిగితావి అబద్ధాలు.
వాస్తవం ఏమిటి ?
లాజికల్లీ ఫ్యాక్ట్స్ భారతదేశ ఎన్నికల సంఘం లోని అత్యున్నత అధికారులను ఈ విషయం గురించి సంప్రదించింది, పైగా అధికారిక పత్రాలను కుడా చూసి, పై క్లైమ్ గురించిన వాస్తవికతను పరిశీలించడానికి ప్రయత్నించింది.
క్లెయిమ్ 1:
ఓటర్ జాబితాలో తమ పేరు లేకపోతే, సెక్షన్ 49A ద్వారా ఆధార్ కార్డును పోలింగ్ స్టేషన్ లో చూపి ‘ఛాలెంజ్డ్ ఓటు’ ను అడగవచ్చు అనే క్లైమ్ అబద్ధం. భారతీయ ఎన్నికల సంఘం ప్రకారం ఎవరైనా ఓటు వేయాలంటే కచ్చితంగా ఓటరు జాబితాలో తమ పేరు ఉండాల్సిందే.
తెలంగాణ లోని భారతీయ ఎన్నికల సంఘం, జాయింట్ చీఫ్ ఎలెక్టోరోల్ ఆఫీసర్, సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ, “ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఓటు వెయ్యగలిగే అవకాశం లేదు. కానీ జాబితాలో పేరు ఉండి, తమ ఓటరు కార్డు లేని నేపధ్యంలో మాత్రం వెయ్యవచ్చు. ఇలాంటి సందర్భాలలో మేము పేర్కొన్న 14 గుర్తింపు కార్డులో ఫోటో ఉన్న ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపి ఓటు వేయొచ్చు, ప్రత్యేకంగా ఫోటోలు కుడా సమర్పించక్కర్లేదు. ఇది ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం.
ఛాలెంజ్డ్ ఓటు అనేది అక్కడ ఉన్న పోలింగ్ అధికారులు, ఓటు వేయటానికి వచ్చిన వ్యక్తి, ఓటర్ల జాబితాలో నమోదైన వ్యక్తి ఒకరు కాదు అని భావిస్తే, అప్పుడు ఛాలెంజ్డ్ ఓటు ప్రక్రియ ని వాడొచ్చు. ఇది 1961 ఎన్నికల నియమావళిలో 36వ పాయింట్ కింద ఉంది.
మరియు 2023 ఎన్నికల సంఘం వారు రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇచ్చే హ్యాండ్ బుక్ ప్రకారం, పోలింగ్ ఏజెంట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద రెండు రూపాయలు జమ చేసి ఛాలెంజ్ ఓటును నమోదు చేయొచ్చు.
పైగా, సెక్షన్ 49 A లో , 1961 ఎన్నికల నియమావళి ప్రకారం ఉన్నది ఛాలెంజ్డ్ ఓట్ల గురించి కాదు. ఇక్కడ ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ల డిజైన్ గురించి ఉంది.
క్లెయిమ్ 2:
ఒక వేళ మీ వోట్ ఇంకొకరు వేస్తే, టెండర్ ఓట్ వినియోగించవచ్చు. ఇది వాస్తవమే. ఈ టెండర్ ఓట్ అనే ప్రక్రియను వివరిస్తూ, తమ బదులు ఇతరులు ఓటు నమోదు చేస్తే టెండర్ ఓటును అడగవచ్చు అని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ ఓటు వేయడానికి ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ల బదులుగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసి దానిని ప్రిసైడింగ్ ఆఫీసర్ కు అందజేయాలి అని తెలిపారు.
టెండర్ ఓట్ కు సంబంధించి, ఎన్నికల సంఘం హ్యాండ్ బుక్ లో కుడా ఇదే విధంగా ఉంది. ఎవరైనా వ్యక్తి తమ ఓటును ఇతరులు వినియోగించారు అని భావిస్తే , ఇదే విషయాన్ని అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ కుడా భావిస్తే టెండర్ ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్ ఇస్తారు, కానీ ఓటింగ్ మెషిన్ ద్వారా ఓటు వెయ్యలేరు.
క్లెయిమ్ 3:
పోలింగ్ బూత్ లో 14 శతం కన్నా అధికంగా టెండర్ ఓట్లు నమోదు అవుతే, మరలా అక్కడ పోలింగ్ నిర్వహించవచ్చు అనేది అబద్ధం. ఎన్నికల సంఘం అధికారుల ప్రకారం, ఈ ప్రక్రియకు అనగా మరలా పోలింగ్ చేయించడానికి టెండర్ ఓట్లకు సంబంధించి ఏ విధమైన బెంచ్ మార్కింగ్ సంఖ్యా లేదు
“ఎప్పుడైతే టెండర్ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందో, అప్పుడు అక్కడ ఉన్న ఎలక్షన్ అబ్సర్వర్, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఒక నిర్ణయానికి రావొచ్చు. కానీ ఇలా టెండర్ ఓట్ల ఎక్కువగా నోమోదు అవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. చాలా నియోజకవర్గాలలో ఇది సాధారణంగా ఒక శాతం కంటే తక్కువ ఉంటుంది,” అని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.
క్లెయిమ్ 4:
మీ దగ్గర ఓటర్ కార్డు లేకపోయినా, ఓటరు జాబితా లో పేరు లేకపోయినా, మీ రెండు ఫోటోలు, ఏదైనా ఫోటో ఉన్న గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ బూత్ కు వెళ్లి అక్కడ ఫారం 8 ని పూర్తి చేస్తే సరిపోతుంది అనేది అబద్దం.
ఇంతకు ముందు తెలియజేసినట్టుగానే ఓటరు జాబితాలో పేరు లేకుండా ఓటు వెయ్యటం అనేది జరగదు. ఫాం 8 కొత్త ఓటరు నమోదు చేసుకోడానికి ఉపయోగించే దరఖాస్తు కాదు. దీనిని ఓటరు జాబితాలో పేరులో ఉన్న తప్పులను సరిచేసుకోడానికి , లేదా ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గానికి ఓటు హక్కును మార్చుకోడానికి వాడతారు. ఈ దరఖాస్తు ద్వారా వికలాంగులు కుడా తమ పేరును చేర్చుకోవచ్చు అని జాయింట్ సీఈఓ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కు తెలిపారు.
భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఫాం 8 స్క్రీన్ షాట్
తీర్పు :
ఓటరు జాబితా లో పేరు లేకున్నా కూడా ఓటు వేయొచ్చు అని వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న అంశాలు అబద్ధం. అందులో ఒక టెండర్ ఓటు నమోదు చేసుకోవచ్చు అనే విషయం తప్ప మిగితావి అబద్ధం. కనుక మేము దీనిని తప్పు దారి పట్టించేటట్టుగా ఉంది అని నిర్ధారించాము.
(అనువాదం : రాజేశ్వరి పరస)